ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల కొత్త పంథా
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలతో ప్రజలను నిండా ముంచుతున్నారు. చార్ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ బుకింగ్, సినిమా యాప్ డౌన్లోడ్, స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు, పార్ట్టైమ్ ఉద్యోగాలు.. ఇలా ఒక్కో మోసానికి ఒక్కో రూపం ఇస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా నమోదు చేసిన ఐదు కేసుల్లో బాధితులు రూ.34 లక్షలకు పైగా కోల్పోయారు.
చార్ధామ్ యాత్ర పేరుతో రూ.3.58 లక్షలు...
అత్తాపూర్కు చెందిన వైద్యుడు కుటుంబంతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లాలని భావించారు. అదే సమయంలో ఇన్స్ట్రాగామ్లో వచ్చిన ఓ ప్రకటన అతడిని ఆకర్షించింది. అందులో ఉన్న నెంబర్కు సంప్రదించగా హిమాలయన్ హెలీ సర్వీసెస్ ప్రతినిధినంటూ నమ్మించిన వ్యక్తి హెలికాప్టర్ ప్యాకేజీ పేరుతో రూ.3.58 లక్షలు వసూలు చేశాడు. నకిలీ బుకింగ్ ఈ–మెయిళ్లు, హోటల్ రిజర్వేషన్ పత్రాలు పంపి నమ్మించాడు. అసలు సంస్థను సంప్రదించగా అవన్నీ నకిలీవని తేలడంతో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
సినిమా యాప్ పేరుతో రూ.3.41 లక్షలు...
మీర్పేట్కు చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్లో కనిపించిన టుబి టీవీ యాప్ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఉచితంగా సినిమాలు చూడచ్చని ఉండటంతో అలా చేసి, యాప్ కోరిన అనుమతులు ఇచ్చాడు. మరుసటి రోజు బ్యాంకింగ్ యాప్లు సరిగా పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించగా... అప్పటికే రెండు ఎస్బీఐ, ఒక హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.3.41 లక్షలు అక్రమంగా బదిలీ అయ్యాయి. సదరు యాప్లో ఉన్న మాలిషియస్ సాఫ్ట్వేర్ ద్వారానే ఈ మోసం జరిగి ఉండొచ్చని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
హెలికాప్టర్ యాత్ర, ఫ్రీగా సినిమాలంటూ టోకరా
ఐదుగురి నుంచిరూ.34 లక్షలకు పైగా స్వాహా


