మొయినాబాద్: నగరానికి దగ్గర ఉన్న భూములు గుంజుకోవడమే రేవంత్రెడ్డి సర్కార్ పనిగా పెట్టుకుంది.. చేవెళ్ల, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఇప్పటికే మూడు వేల ఎకరాలకు పైగా పేదల భూములు లాక్కున్నారని మాజీ మంత్రి సబితారెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలో ఇళ్ల స్థలాల కోసం పట్టాలు పొందిన పేదలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో 17 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఆమె దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. 2007లో తాను మంత్రిగా ఉన్నప్పుడు హిమాయత్నగర్కు చెందిన 290 మంది పేదలకు 60 గజాల చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చి.. సర్వేనంబర్ 151లో స్థలాలు కేటాయించానన్నారు. అప్పట్లో కోర్టు కేసు వల్ల స్థలాలు అప్పగించలేకపోయామన్నారు. 2023లోనూ పాత పట్టాలున్నవారికి స్థలాలు ఇవ్వడం కోసం శంకుస్థాపన సైతం చేశామన్నారు. అందరికీ కొత్త పట్టాలు అందజేసి స్థలాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే యాదయ్యకు చెప్పామని.. ఆయన ఎందుకు స్థలాలు ఇప్పించలేదో తెలియదన్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం మార్కెట్ ఏర్పాటుకు పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలే దొరికాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అనంతరెడ్డి, నర్సింహారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, మాజీ సర్పంచ్లు శ్రీహరియాదవ్, మంజుల, నరోత్తంరెడ్డి, మహేందర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు త్త మాణిక్రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, నాయకులు ఆంజనేయులు, రవియాదవ్, కృష్ణారెడ్డి, రాజు, శ్యాంరావు, ఎల్లేష్, నర్సింహగౌడ్, ప్రసాద్రెడ్డి, పరమేష్, యువజన సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ ఏర్పాటుకు పేదలకిచ్చిన స్థలాలే దొరికాయా
మాజీ మంత్రి సబితారెడ్డి


