పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. మంఖాల్ గ్రామానికి చెందిన యాదయ్య కుమారుడు బాకీ కార్తీక్(23) డీఆర్డీఎల్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రోజు మాదిరిగానే ఈ నెల 10వ తేదీన ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. కార్తీక్ డ్యూటీకి రాలేదని సహోద్యోగి శ్రీరాములు అతని తల్లి అరుణమ్మకు సమాచారం ఇచ్చాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఫోన్లో సంప్రదించగా స్విచ్ఛాప్ వచ్చింది. సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లోనైనా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
గచ్చిబౌలి: మద్యం మైకంలో భార్యతో గొడవ పడుతూ అడ్డువచ్చిన కుమారుడిని తిట్టడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్.వెంకన్న తెలిపిన మేరకు..గచ్చిబౌలి రాజీవ్నగర్లో నివాసం ఉంటూ కూలి పనులు చేసుకొనే జి.ఎల్లయ్య తరచూ భార్యతో గొడవపడుతుంటాడు. శనివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన ఎల్లయ్య భార్యతొ గొడవపడ్డాడు. గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చిదివే జి.మోహన్(15) అడ్డువెళ్లడంతో తండ్రి తిట్టాడు. దీంతో అర్థరాత్రి దాటిన తరువాత మోహన్ పక్కన్నే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడున్న వారు నిద్రలో ఉండటంతో గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.


