● స్కూటర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● అక్కడికక్కడే సెక్యూరిటీ గార్డు దుర్మరణం
మొయినాబాద్: వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు స్కూటర్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన పంచాలింగాల బాల్రెడ్డి (43) జేబీఐటీ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కనకమామిడి నుంచి మొయినాబాద్కు స్కూటర్పై వెళ్తుండగా తాజ్ సర్కిల్ హోటల్ వద్దకు రాగానే మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల నుంచి మెహిదీపట్నం వెళ్తూ అతివేగంతో వచ్చి స్కూటర్ను ఢీకొట్టింది. దీంతో బాల్రెడ్డి రోడ్డుపై పడగానే బస్సు వెనుక చక్రాలు అతని తలపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఉగాది పండుగరోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. మృతునికి భార్య అరుణ, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


