‘డబుల్’ నిరసన
● అనర్హులు ఇళ్లు తీసుకున్నారని
మహిళల ఆందోళన
● పేదలను గుర్తించాలని
ప్రభుత్వానికి అభ్యర్థన
తుక్కుగూడ: అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు బుధవారం తుక్కుగూడ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని సర్ధార్నగర్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామంలో నిర్మించిన డబుల్బెడ్ రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం లాటరీ పద్ధతిన అర్హులకు కేటాయించిందని తెలిపారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి, ఒక్కొక్కరు మూడు, నాలుగు ఇళ్ల చొప్పున తీసుకున్నారని ఆరోపించారు. కొంత మందికి పట్టాలు ఇచ్చినా ఇళ్లు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అనర్హులను తొలగించి, పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరు మృతి
మంచాల: బొలెరో వాహనం ఫల్టీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన మంచాల మండల పరిధిలోని రంగాపూర్ సమీపంలో కోళ్ల వంపు వాగు మలుపు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాచారం మండలం గడ్డ మల్లయ్య గూడెం గ్రామానికి చెందిన ఓడుసు శివ(25) అతని స్నేహితులు యావ శంకర్, ఎడ్ల నాగరాజుతో కలిసి లోయపల్లి నుంచి రంగాపూర్ వైపు బొలెరో వాహనంపై వస్తున్నారు. రంగాపూర్ సమీపంలో చేరుకోగానే కోళ్ల వంపు వాగు మలుపు వద్ద రోడ్డుపై అతి వేగంగా వచ్చి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న శివకు బలమైన గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వెంటనే 108 అంబులెన్స్లో అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


