హస్తంలో కారు చిచ్చు!
బషీరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బషీరాబాద్లో పంచాయతీ ఎన్నికలు వర్గ పోరుకు దారి తీశాయి. మండల కేంద్రం మేజర్ పంచాయతీ కావడంతో సర్పంచ్ పీఠం కోసం అధికార పార్టీ నేతలు వెంకటేష్ మహరాజ్, అజయ్ప్రసాద్ కుటుంబం నుంచి అనూప్ప్రసాద్ పోటీలో నిలిచారు. అయితే ప్రధాన పోటీదారు అనుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుదారు అబ్దుల్ రజాక్ చివరి నిమిషంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చర్చనీయాంశమైంది. దీంతో బషీరాబాద్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.
బడా నాయకుల పోటీ
మేజర్ గ్రామ పంచాయతీ. మొదట్లో ఇక్కడ సర్పంచ్గా పనిచేసిన నాయకులు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రులు కూడా అయ్యారు. దీంతో ఈ పంచాయతీకి పోటీ చేయడానికి బడా నేతలు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో ఈసారి బీసీ జనరల్ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మహరాజుల కుటుంబం నుంచి వెంకటేష్ మహరాజ్, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ ఇంటి నుంచి అనూప్ ప్రసాద్ ఇద్దరు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ మద్దతుతో వేసిన ఆ పార్టీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ రజాక్ తన నామినేషన్ను బుధవారం ఉపసంహరించుకున్నారు. ఎండీ మహ్మద్ అనే వ్యక్తి ఎంఐఎం మద్దతుతో బరిలోకి దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం హస్తం పార్టీ నేతల మధ్యే నెలకొంది.
చర్చలు విఫలం
అంతకు ముందు అనూప్ ప్రసాద్ నామినేషన్ ఉపసంహరించాలని వెంకటేష్ మహరాజు కుటుంబ సభ్యులు, వారి అనుచరులు తాండూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అజయ్ ప్రసాద్, ఆయన అనుచరులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఇద్దరు బలమైన నేతలు కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. ఈ అనూహ్య పరిణామం ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది.
ప్రచారానికి ఎమ్మెల్యే దూరం!
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు బషీరాబాద్ సర్పంచ్గా పోటీ చేస్తుండడంతో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. పార్టీకి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎవరికి మద్దతువ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించారు. మండలంలోని మిగతా గ్రామాల్లో ఈ నెల 5 నుంచి ప్రచారం చేస్తారని ఎమెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది.
బషీరాబాద్లో రెండుగా చీలిన
పార్టీ శ్రేణులు
ఇద్దరు హస్తం పార్టీ నేతల మధ్య పోటీ
బరి నుంచి తప్పుకొన్న
బీఆర్ఎస్ మద్దతుదారు
హస్తంలో కారు చిచ్చు!
హస్తంలో కారు చిచ్చు!
హస్తంలో కారు చిచ్చు!


