
హత్య చేసి, నిప్పంటించి..
● రాజాపూర్లో దారుణం ● మహిళను హత్యచేసిన ప్రియుడు
ధారూరు: భార్యాపిల్లలను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన మండల పరిధిలోని రాజాపూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ అనిత, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మ్యాతరి బాబయ్య అడ్డాకూలీగా జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన ఆయన తరచూ భార్య అనంతమ్మను వేధించేవాడు. దీంతో విసుగు చెందిన ఆమె నాలుగేళ్ల క్రితం తన నలుగురు ఆడ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అడ్డా కూలీ అయిన బాబయ్య పనులకు వచ్చే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకునేవాడు. ఈక్రమంలో దోమ మండలం రాకొండకు చెందిన బండి వెంకటమ్మ(47)తో పరిచయం ఏర్పడింది. రెండు నెలల క్రితం ఆమెను ఇంటికి తెచ్చుకున్న బాబయ్య.. వెంకటమ్మతో కలిసి గ్రామంలోనే ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ గురువారం రాత్రి వెంకటమ్మను హత్య చేసి, ఆమె శవాన్ని గోనె సంచిలో కుక్కాడు. పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలను గమనించి గ్రామస్తులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. హతురాలి కొడుకు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

హత్య చేసి, నిప్పంటించి..