తిరుమల:శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచు కుని కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు అలిపిరి ఫుట్పాత్ నుంచి తిరుమల గరుడ నారాయణగిరి (జీఎన్న్సీ) వరకు శనివారం జాయింట్ టీమ్ తనిఖీలు నిర్వహించింది. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అలిపి రి వైపు వెళ్లి ఫుట్పాత్ మార్గం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఫుట్పాత్ మార్గంలోని షాపులు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల లైసెన్సులను పరిశీలించారు. నిబంధనలు పాటించని 30 షాపులకు టీటీడీ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న 13 మందిని గుర్తించి, వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఆరుగురు భిక్షాటన చేస్తున్నట్టు గుర్తించి వారిని తరలించారు.


