తిరుపతి క్రైం : సైబర్ నేరాల నియంత్రణతోపాటు కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. నేరస్థులు కొత్త సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నందున పోలీసులు కూడా తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) కాన్ఫరెన్స్ హాల్లో నీలీట్ తిరుపతి సౌజన్యంతో నిర్వహించిన ‘సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషనన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్’ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వంద మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
మారుతున్న నేరాల తీరు
సాంకేతిక పరిజ్ఞానం, సెల్ఫోన్లు, సోషల్ మీడియా ప్రజల జీవితంలో భాగమయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. నేరస్థులు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నకిలీ లింకులు, ఫేక్ న్యూస్, ఆన్న్లైన్ టికెట్ మోసాలు, డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. శిక్షణలో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని రోజువారీ దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్న్, డిజిటల్ ఫోరెన్సిక్స్పై పోలీసు అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ అందించిన నీలీట్ తిరుపతి డైరెక్టర్ శివకుమార్, ఫ్యాకల్టీ సభ్యులు అఖిల్, మనీష్ యాదవ్కు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడిషనల్ ఎస్పీ ఐ.రామకృష్ణ (తిరుమల), సైబర్ టీమ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఐటీ కోర్ సిబ్బందిని అభినందించారు.


