తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో బిల్లు కలెక్టర్లను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ గత 13 రోజులుగా తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు రిలే, నిరాహార దీక్షలు చేపడుతున్న విషయాన్ని సీఐటీయూ నేతలు సీఎండీ శివశంకర్ దృష్టికి తీసుకు వెళ్లారు. శనివారం సీఐటీయూ నేతలు కందారపు మురళి, జయచంద్ర, ఏపీ బిల్ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ సీఎండీని మర్యాదపూర్వకంగా కలసి విద్యుత్తు బిల్ కలెక్టర్లు చేస్తున్న పోరాటం గురించి వివరించారు. ఆ మేరకు స్పందించిన సీఎండీ తన చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం చెప్పినట్టు చేయడం తప్ప బిల్ కలెక్టర్లపై తమకు ఎలాంటి విధ్వేషాలు లేవన్నారు. విద్యుత్తుశాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎనర్జీ సెక్రటరీ విజయానంద్ను కలిసి విన్నవించాలని సూచించారు. సీఎండీని కలసిన వారిలో కర్నూలు జిల్లా బిల్ కలెక్టర్లు, సీఐటీయూ నేతలు, ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉన్నారు.


