చంద్రగిరి: తిరుపతి సమీపంలోని మోహన్బాబు విశ్వవిద్యాలయ మూడవ స్నాతకోత్సవ వేడుకలు వర్సిటీ ప్రాంగణంలోని ఇండోర్ స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఛాన్స్లర్ మోహన్బాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చైన్నెకి చెందిన డాక్టర్ ఎం.జి.ఆర్.ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛాన్స్లర్ డాక్టర్ ఎసి.షణ్ముగం, విశిష్ట అతిథిగా బీఏజీ ఫిల్మ్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ అనురాధ ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన రాజ్యసభ సభ్యులు, బీసీసీఐ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా, అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ వాటర్ కలర్ ఆర్టిస్ట్ పరేష్ మైథి విశ్వవిద్యాలయం తరఫున వర్సిటీ చాన్స్లర్ మోహన్ బాబు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న 3,600 మందికి పైగా యూజీ, పీజీ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రో–ఛాన్స్లర్ మంచు విష్ణు మాట్లాడుతూ.. సమాజం విసిరే సవాళ్లను ఎదుర్కొని విజేతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఛాన్స్లర్ డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ.. నాటి ఇంజినీరింగ్ కళాశాల స్థాయి నుంచి నేడు విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందే వరకు దాదాపు 25,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడడం ఎంతో గర్వకారణమన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. విద్యారంగానికి మోహన్ బాబు అందిస్తున్న సేవలను, మంచు విష్ణు నటనలోని ప్రతిభను కొనియాడారు. శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ఎంబీయూ వీసీ డాక్టర్ పి.వెంకటరమణ పాల్గొన్నారు.


