చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు 2026–27 విద్యా సంవత్సరానికి గాను స్పాట్ కౌన్సెలింగ్ను శనివారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినోద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 46 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో 291 ఖాళీలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఆయన అలాట్మెంట్ లెటర్ను అందజేశారు. ఈ నెల 31వ తేదీలోపు కళాశాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్కుమార్, డాక్టర్ ఆదిలక్ష్మమ్మ, నాగేశ్వరరావు, వీణ, రాంబాబునాయక్, మోహన్, మనోహర్, రఘు, పద్మజ పాల్గొన్నారు.
వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
తిరుపతి తుడా: ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్యుల రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎస్వీ వైద్య కళాశాలలో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ జగదీష్, వైద్యమండలి మాజీ చైర్మన్ ప్రస్తుత కౌన్సిల్ సభ్యులు, రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ కమిటీ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటీ శ్రీహరిరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాతూ గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్, రెన్యువల్ ప్రక్రియను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, వైద్యమండలి సభ్యులు డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు.
సాంస్కృతి వారసత్వాన్ని అనుసంధానం చేయాలి
తిరుపతి సిటీ: రాయలసీమ సాంస్కృతిక వారసత్వాన్ని ఆర్థికాభివృద్ధికి అనుసంధానం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. తిరుపతి ఎస్వీ వేదిక వర్సిటీలో రైజింగ్ రాయలసీమ, కల్చరల్ ఎకానమీ అనే అంశంపై శనివారం సింపోజియం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యరద్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎండోమెంట్ మాజీ కమిషనర్ ఎన్.ముక్తేశ్వరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని అపారమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వాన్ని గుర్తించి, దానిని ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, ఉపాధి అవకాశాల కల్పనతో అనుసంధానం చేయాలని సూచించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డాక్టర్ కే.మునిరత్నంరెడ్డి, ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
విఖనసాచార్యుల సన్నిధికి మలయప్పస్వామి
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు శనివారం ఉత్తర మాడ వీధిలో గల విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమి నాడు జరగగా.. ఆ మరుసటి రోజు స్వామి, అమ్మవార్లు శ్రీ విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు చేశారు. శ్రీవారి ఆలయ పారు పత్తేదార్ బాలసుబ్రహ్మణ్యం, విఖనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.


