బుచ్చినాయుడుకండ్రిగ : బంధువులు చనిపోవడంతో అంత్యక్రియలకు ద్విచక్ర వాహనంపై వెళ్లుతున్న బావబామ్మర్దిని టెంపో ట్రావెలర్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని శ్రీకాళహస్తి–తడ రోడ్డురి పదో మైలు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. రేణిగుంట మండలం, సుబ్బయ్యగుంట గ్రామానికి చెందిన గురవారెడ్డి (45) సూళ్లూరుపేట మండలం, బూడిదమడుగు గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి (60) బావబామ్మర్దులు. ఇద్దరూ కలసి మోటార్ సైకిల్ పై రేణిగుంట మండలంలోని సుబ్బయ్యగుంట గ్రామంలో బంధువు అంత్యక్రియలకు బయల్దేరారు. శ్రీకాళహస్తి నుంచి శ్రీసిటీలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసుకుని తడ వైపు వెళ్లుతున్న టెంపో ట్రావెలర్ వాహనం ద్విచక్రవాహనాన్ని కేటీ రోడ్డు పదో మైలు గ్రామ సమీపంలోని మలుపు వద్ద వేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో గోపాల్రెడ్డి, గురవారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గోపాల్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గురవారెడ్డిని 108 అంబులెన్స్లో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.


