ఏర్పేడు: తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీలు–2026లో తిరుపతి ఐసర్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరచారు. ఐసర్ విద్యార్థులు స్వర్ణ పతకం – ఆర్టిస్టిక్ పెయిర్ (సీనియర్ 18–28 పురుషులు): దేబాశిష్ పుహాన్, శుభం కబడే, రజత పతకం – ట్రెడిషనల్ (సీనియర్–ఏ, 28–35 మహిళలు): గౌరి వి.భట్ (భౌతిక శాస్త్ర విభాగం), కాంస్య పతకం – ట్రెడిషనల్ (సీనియర్–ఏ, 28–35 పురుషులు): ఆదిత్య విలాస్ భాస్కర్వారా (జీవశాస్త్ర విభాగం), కాంస్య పతకం – ట్రెడిషనల్ (సీనియర్ 18–28 పురుషులు): దేబాశిష్ పుహాన్ (జీవశాస్త్ర విభాగం) పతకాలను సాధించినట్లు ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య, రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ తెలిపారు. విజేతలందరూ రానున్న రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో తిరుపతి జిల్లాకు ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత సాధించారని వివరించారు. విద్యార్థుల విజయానికి యోగా శిక్షకుడు కుమార్రాజు విశేషంగా కృషి చేశారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వీరంతా ప్రతిభ చూపాలని వారు కోరారు.
మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలు
రేణిగుంట: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తి నేరం అంగీకరించడంతో కోర్టు అతనికి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించినట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు. రేణిగుంట పట్టణంలో పది రోజులు క్రితం అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెంకు చెందిన ఎం.లోకేష్ (27) మద్యం తాగి వాహనం నడపడంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. సోమవారం తిరుపతిలోని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో న్యాయమూర్తి 21 రోజుల సాధారణ కారాగార శిక్ష విధించారు.


