భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థ
తిరుపతి మంగళం:రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ భ్రష్టుపట్టించారని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరణాకరరెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. డీఎస్సీలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకవచ్చారన్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారని కొనియాడారు. 17 మెడికల్ కళాశాలలను నిర్మించిన ఘనత జగనన్నదేనని వెల్లడించారు. చంద్రబాబు పాలనలో డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఒక్కో ఉద్యోగాన్ని రూ.30లక్షల చొప్పున అమ్మేశారని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో 20 ఉద్యోగాలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. నిజమైన క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. డీఎస్సీలో అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపించడంతో పాటు లోకేష్ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ ఘటనపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేశారని, అదే బాటలో లోకేష్ నడవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.


