శ్రీకాళహస్తి రూరల్ : ఎల్నినో ప్రభావంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయని, తద్వారా వరి రైతులు ఇక నుంచి ఆరు తడులుగా నీళ్లు పెట్టుకోవాలని ఆచా ర్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రతిమ, డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. గురువారం మండలంలోని కొత్తూరు, ఏర్పేడు మండలంలోని దుర్గిపేరి రెవెన్యూ పరిధిలో వారు పంట పొలాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ మే, జూన్ నెలల్లోనే పంటలు సాగు చేశామని, కానీ అనూహ్యంగా బోర్లలో నీరు తగ్గటం వల్ల పంటలు ఎండుముఖం పట్టాయని తెలిపారు. అనంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట పిలకదశ నుంచి పరిపక్వత దశలో ఉందన్నారు. ప్రధానంగా ఎల్నినో ఎఫెక్ట్ వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని, ఇక నుంచి ఆరుతడులుగా నీళ్లు పెట్టుకోవాలని సూచించారు. ఈ సీజన్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు కామన్ సర్వీస్ సెంటర్లో వరి పంటకు ఎకరాకు రూ.160 చెల్లించి బీమా చేయించుకోవాలని సూచించారు. వారి వెంట తిరుపతి సహాయ వ్యవసాయ సంచాలకులు ధనుంజయరెడ్డి, శ్రీకాళహస్తి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు (రెగ్యులర్) పి.రమేష్రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మమతారెడ్డి పాల్గొన్నారు.


