రామచంద్రాపురం: మండల పరిధిలోని పిల్లారికోన గుట్టను తవ్వి చెరువులో పోస్తున్న అక్రమార్కుల బరితెగింపు చర్యను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత రెచ్చిపోయారు. అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యానికి తెగబడ్డాడు. వివరాలు.. నెత్తకుప్పం గ్రామ లెక్క దాఖల సర్వే నం.306, 309లో సుమారు 20 ఎకరాల పిల్లారికోన చెరువు ఉంది. దానికి సంబంధించిన మొరవ వాగును, పరిసర అటవీ భూములను టీడీపీ నాయకుడు మురళి ఆక్రమించాడు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో చెరువులో తవ్వకాలు చేపడుతున్నాడు. దీన్ని స్థానికులు అడ్డుకుని, అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోగా సదరు టీడీపీ నేత గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగాడు. ఈ అక్రమ తవ్వకాల వల్ల వర్షాలప్పుడు గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు పిల్లారికోనలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి తీవ్రమవుతోందని వాపోయారు.
స్పందించని అధికారులు
ఈ అక్రమాలపై సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఆయన స్పందించలేదన్నారు. సంబంధిత కలెక్టర్ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


