శ్రీకాళహస్తి: సంస్కృత పండితుడు, ఆధ్యాత్మిక గ్రంథకర్త, శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించి భక్తులకు అందించిన ప్రముఖ సాహితీవేత్త పాలకోడేటి జగన్నాథరావు పరమపదించారు. రాజమహేంద్రవరం విరించి వానప్రస్థాశ్రమంలో నివసిస్తూ జీవితాంతం పరమేశ్వరునికి అక్షరార్చన చేస్తూ అనేక విలువైన గ్రంథాలను రచించారు. గురుకుల విద్యను అభ్యసించిన ఆయన కళాశాలలో అధ్యాపకునిగా వేలాది మంది విద్యార్థులకు బోధించారు. అచ్చతెలుగు శృంగార శాకుంతలంకు వ్యాఖ్యానం, స్వాధ్యాయ సందోహం పేరిట వేదమంత్రాలకు వివరణ, వేదసూక్తుల ఆంధ్రానువాదం, నాయనార్ల సమగ్ర చరిత్ర వంటి అనేక రచనలు చేశారు. గతంలో శ్రీకాళహస్తి మాహాత్యంను వచన రూపంలో అందించిన ఆయన, అనంతరం శివపురాణాంతర్గతమైన శ్రీకాళహస్తి స్థలపురాణాన్ని 9,430 శ్లోకాలకు సరళమైన వ్యాఖ్యలతో ఐదు భాగాలుగా విభజించి గ్రంథరూపంలో వెలువరించారు. ఈ రచన శ్రీకాళహస్తి శివభక్తుల నుంచి విశేష ఆదరణ పొందింది. కంచీ పీఠాధిపతుల ఆదేశాల మేరకు కంచీ మహాత్యం గ్రంథాన్ని అనువదిస్తున్న సమయంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సాహితీవేత్తలు, వేదపండితులు, శివభక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మాజీ రెవెన్యూ డివిజనల్ అధికారి, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు, నాగరాజుజట్టి తదితరులు ఆకాంక్షించారు.


