డ్రోన్లతో ఫొటోలు తీయడమేంటి?
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న అఖిలపక్ష నేతలు
తిరుపతి అర్బన్: జిల్లాలో జరుగుతున్న భూకబ్జాలు, రౌడీయిజం, గూండాయిజానికి అడ్డుకట్ట వేయాలిగానీ.. ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు డ్రోన్ కెమెరాలతో ధర్నా చేస్తున్న వారి ఫొటోలను తీయడం విడ్డూరంగా ఉందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. సోమవారం అన్ని పార్టీలకు చెందిన నేతలు కలెక్టరేట్ వద్ద తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రణలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. వృద్ధులకు చెందిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలన చేయడం...తర్వాత వాటికి దొంగ పట్టాలు సృష్టించి కబ్జా చేయడం లాంటివి జరుగుతున్నాయన్నారు. విదేశాల్లో నివాసం ఉంటున్న వారి ఆస్తులు ఆక్రమించడం రివాజుగా మారుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపడుతున్న అరాచకాలపై న్యాయ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు.
అర్జీల వెల్లువ
కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 446 అర్జీలు వచ్చాయి. డీఆర్వో నరసింహులు ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ కార్యాక్రమాన్ని చేపట్టారు. డీఆర్వోతోపాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్నాయక్, భరత్నాయక్, రోజ్మాండ్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 261 అర్జీలు వచ్చాయి.


