తిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఏడుగురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. 2016 సెప్టెంబర్ 11న ప్రొద్దుటూరు రేంజ్, కాజీపేట సెక్షన్, లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్, పాయ బావి రాస్తా, జాండ్లవరం బీట్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా, మైదుకూరు మండలం, జాండ్లవరం గ్రామానికి చెందిన కె.రామసుబ్బయ్య అలియాస్ లారీ, ఎం.పెంచలయ్య, ఐ. పుల్లయ్య, బాలినేని చిన్న రాయుడు, జి.నాగేంద్ర అలియాస్ పిల్లగాడు, ఎం.సురేష్ అలియాస్ పొట్టోడు, ఎం.సుబ్బయ్య, గుజ్జుల సుబ్బయ్య అలియాస్ శెట్టిలు సుమో వాహనంలో అక్రమంగా 110 కిలోల 19 ఎర్రచందనం దుంగలను తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డారు. ఎనిమిది మంది పై ఫారెస్ట్ సిబ్బంది కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ దశలో మూడో నిందితుడిగా ఉన్న పుల్లయ్య మృతి చెందాడు. నేరం ఏడుగురిపై రుజువు కావడంతో న్యాయమూర్తి ఏడుగురికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సోమవారం తీర్పు సమయంలో ఆరవ నిందితుడుగా ఉన్న సురేష్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అతనిని వారెంట్ పై హాజరు పరచాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.


