చంద్రగిరి: అంతుచిక్కన వ్యాధి సోకి గొర్రెల మృత్యువాత పడుతున్న ఘటన మండలంలోని చంద్రగిరి, శానంబట్ల, తొండవాడ ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఇక్కడ నెల రోజుల వ్యవధిలో 130కిపైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట మూర్చవ్యాధి సోకి కుప్పకూలిపోతున్నాయని, నాలుగు రోజుల వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెబుతున్నారు. ఆపై ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 10 మంది పాడి రైతులుకు చెందిన 130కి పైగా జీవాలు మృత్యువాతపడ్డాయని వాపోతున్నారు.
చలించని పశువైద్యశాఖ
మేకలు, గొర్రెలకు చంద్రగిరిలోని పశుసంవర్థక శాఖ కార్యాలయంతో పాటు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో సైతం చికిత్స చేయిస్తున్నట్టు పెంపకందారులు చెబుతున్నారు. అక్కడి వైద్యాధికారులు నామమాత్రపు చికిత్సలు చేసి పంపుతున్నారని, వారు చికిత్స చేసినా మరణాలు ఆగడం లేదని వాపోతున్నారు. వ్యాధి ఏమిటనేది అధికారులే నిర్ధారించకపోతున్నారని ఆరోపిస్తున్నారు. చివరకు మృతి చెందిన గొర్రెను పోస్టుమార్టం సైతం నిర్వహించారని చెప్పారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటాలు
మృతి చెందుతున్న జీవాలను కొంత మంది పాడి రైతులు తక్కువ ధరకే మార్కెట్లకు విక్రయిస్తున్నారు. వాటిని రోజుల తరబడి ఫ్రిడ్జ్లతో నిల్వ చేసి ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చంద్రగిరి, తొండవాడ, ఏ.రంగంపేటతో పాటు తిరుపతి రూరల్లోని కాలూరు, మల్లవరం, పుదిపట్ల, చెర్లోపల్లిలోని మాసం దుకాణాదారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆదివారంతో పాటు మరో రెండు రోజులు వాటిని విక్రయిస్తున్నారు. వ్యాధులు సోకి మృతి చెందిన జీవాలను దహనం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అలా చేయడం లేదు.


