తిరుపతి తుడా : ఎస్వీ వైద్య కళాశాల మైదానంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఫైనల్లో ఉత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 జట్లు పలు వైద్య, దంతకళాశాలల నుంచి ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్లో కర్నూల్ వైద్య కళాశాల విద్యార్థులు,, ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులకు హోరా హోరీగా మ్యాచ్ సాగింది. ఎస్వీ వైద్య కళాశాల విజేతగా నిలిచింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.సాయి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీ, బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు ఆటవిడుపుగా ఈ టోర్నమెంట్ నిర్వహించినట్లు వెల్లడించారు. విద్యార్థులు చక్కటి క్రీడాస్పూర్తిని ప్రదర్శించారని అభినందించారు. ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.మనోహర్, డాక్టర్ తులసీరామ్, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రోజా రమణి, డాక్టర్ శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ త్రిమూర్తులు, డాక్టర్ శరవణ పాల్గొన్నారు.


