తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్ను జయించడం సాధ్యం
తిరుపతి తుడా: తొలిదశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం క్యాన్సర్ అవగాహన వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఇందిరా మైదానంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్పై అనవసరమైన భయాన్ని వీడి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్విమ్స్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాన్సర్ను స్టేజ్–1, స్టేజ్–2 దశలో గుర్తిస్తే దాదాపు వంద శాతం కోలుకునే అవకాశం ఉందన్నారు.
చెడు అలవాట్లతోనే సమస్య
పొగతాగడం, మద్య సేవనం, ఊబకాయం, అసమతుల్య ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాల వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని, ఇవన్నీ నివారించదగిన కారణాలేనని తెలిపారు. ప్రధానంగా యువత చిన్న వయసులోనే పొగాకు అలవాట్లకు బానిస కావడం భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. క్యాన్సర్ అనే మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, స్వీకార్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల, వైద్య సిబ్బంది, వలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్యాన్సర్ అవగాహన వాక్థాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్


