
మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ
మృతదేహంతో కలెక్టరేట్ వద్ద ఆందోళన
కాళేశ్వరం(మహబూబాబాద్): తల్లికి ఆరోగ్యం బాగాలేదని కొడుకు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేసుకున్న తల్లి తన కొడుకు అన్నం సరిగ్గా తింటలేడు, కడుపు నొప్పి అంటున్నాడని వైద్యులకు చూపించింది. పరీక్షలు చేసిన వైద్యులు (సెలెన్) గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ ఇవ్వడంతో అస్వస్థతకు గురై యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సరోజన తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో కుమారుడు నాగరాజు(23) బైక్పై మహదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకొచ్చాడు.
వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసిచ్చారు. కాగా, తల్లి తన కొడుకు కూడా ఆరోగ్యం బాగుండడం లేదని వైద్యులకు తెలిపింది. వైద్యులు నాగరాజుకు పరీక్షలు చేసి (సెలెన్) గ్లూకోజ్ ఎక్కించి, అందులో ఇంజక్షన్ వేశారు. ఈ క్రమంలో ఫిట్స్ వచ్చి అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని తల్లికి సూచించి వెంటనే పంపారు. భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో కొడుకు మరణవార్తతో కోపోద్రేకులైన తల్లిదండ్రులు మృతదేహంతో కలెక్టరేట్ గేట్ వద్ద వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
విషయం తెలుసుకున్న మహదేవపూర్ ఎస్సై వారికి నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ ఘటనపై తల్లి సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వపన్కుమార్ తెలిపారు. సరోజన సత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు మృతితో శోకసంద్రంలో మునిగారు. కాగా, వైద్యుల తప్పిదంతోనే నాగరాజు చనిపోయాడని, వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత వైద్యులను సస్పెండ్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని డీవైఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.