పీక్‌ డిమాండ్‌లోనే ‘యాదాద్రి’ పవర్‌ | Yadadri thermal power plant at peak demand | Sakshi
Sakshi News home page

పీక్‌ డిమాండ్‌లోనే ‘యాదాద్రి’ పవర్‌

Feb 11 2026 4:12 AM | Updated on Feb 11 2026 4:12 AM

Yadadri thermal power plant at peak demand

ప్రాజెక్టు వ్యయం మెగావాట్‌కు రూ.9.5 కోట్లు

విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ. 7 పైనే

నియంత్రణ మండలి ముందు జెన్‌కో పిటిషన్‌

నిర్మాణ వ్యయం భారీగా పెంచడంపై మండలి ఆరా

సాక్షి, హైదరాబాద్‌: వేసవి విద్యుత్‌ డిమాండ్‌ సమయంలోనే యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీలుందని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (టీజీ జెన్‌కో) స్పష్టం చేసింది. మిగతా రోజుల్లో విద్యుత్‌ విక్రయాలు కొంత కష్టమేనని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, విద్యుత్‌ ధరపై జెన్‌కో ఇటీవల ఈఆర్సీ ముందు అనుమతి కోసం నివేదిక సమర్పించింది. 

మెగావాట్‌కు రూ. 9.5 కోట్ల మేర నిర్మాణ ఖర్చయిందని.. దీనివల్ల యూనిట్‌ విద్యుత్‌ను రూ. 7పైనే విక్రయించాల్సి ఉంటుందని వివరించింది. ఈ మేరకు 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ వ్యయం పెరగడానికి గల కారణాలను వివరించింది. అయితే జెన్‌కో ఉత్పత్తి వ్యయం పిటిషన్‌పై ఈఆర్సీ అనేక అనుబంధ ప్రశ్నలు వేసింది.

కొన్ని అనవసర ఖర్చులను కలపడంపై వివరణ ఇవ్వాలని కోరింది. దీని తర్వాతే టారిఫ్‌ ఆర్డర్‌ ఇచ్చే వీలుంది. మరోవైపు యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ నిర్మాణ వ్యయంపై పలు విద్యుత్‌రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సివిల్‌ పనుల్లో చేసిన ఖర్చు, నాణ్యతా ప్రమాణాలపై సందేహాలు లేవనెత్తారు. 

హైపవర్‌ మార్కెట్‌కు బ్రేక్‌
ఈ ఏడాది వేసవిలో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 300 మిలియన్‌ యూనిట్ల మేర ఉండొచ్చని అంచనా వేశారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ యూనిట్‌ రూ. 2.50 వరకూ లభిస్తోంది. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ మాత్రమే సోలార్‌ విద్యుత్‌ లభిస్తోంది. రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల మధ్య ఐదు గంటల పాటు విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ. 10 వరకూ ఉంటుంది. 

ఈ సమయంలో జెన్‌కో యాదాద్రి విద్యుత్‌ యూనిట్‌ రూ. 7కు లభిస్తుంది. కాబట్టి ఈ ఐదు గంటలు యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తికి ఢోకా ఉండదని ఈఆర్సీ ఎదుట జెన్‌కో పేర్కొంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల ఈ ప్లాంట్‌ ద్వారా రోజుకు 95 మిలియన్‌ యూనిట్ల వరకు ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. వేసవి సమయంలో ఉత్పత్తి ద్వారానే యాదాద్రి నిర్వాహణ, రుణంపై వడ్డీ తీరుతుందని జెన్‌కో చెబుతోంది. అయితే నిర్మాణం సందర్భంగా చేపట్టిన సివిల్‌ ఖర్చులను సమగ్రంగా పరిశీలించాలని ఈఆర్సీ భావిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement