
ఉద్యోగుల మధ్య సత్సంబంధాలతో 49 శాతం ఎక్కువ జాబ్ శాటిస్ఫాక్షన్
సహచరులతో కలిసి లంచ్, టీలతో పెరుగుతున్న మిత్రత్వం
అదే సమయంలో ఒంటరితనంతో బాధపడుతున్న మరో 49 శాతం ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పనిప్రదేశాల్లో స్నేహాలు ఉద్యోగులకు 49 శాతం ఎక్కువ జాబ్ శాటిస్ఫాక్షన్ను అందిస్తున్నాయని ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట జరిగిన తాజా సర్వే వెల్లడించింది. సంస్థల ఉత్పాదకత పెరుగుదల, దీర్ఘకాలిక విజయాల సాధనకు సైతం ఇవి దోహదపడుతున్నాయని తెలిపింది. అదే సమయంలో సహచరులతో స్నేహంచేయని మరో 49 శాతం మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కుమిలిపోతున్నట్లు పేర్కొంది.
భారత్ సహా 21 దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీసు స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా, మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆఫీసుల్లో లంచ్ లేదా టిఫిన్ చేసే వేళలు లేదా కలిసి టీ, ఇతర పానియాలు సేవించే సమయాల్లో చోటుచేసుకొనే సంభాషణల వల్ల ఉద్యోగుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయని సర్వే గుర్తించింది.
అదేవిధంగా సంబంధిత సంస్థల వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ఉద్యోగులను అనుసంధానం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తేల్చింది. మరోవైపు ఒంటరితనానికి లోనవుతున్న ఉద్యోగులు సామాజికంగా కనెక్ట్ అయిన వారితో పోలిస్తే రెట్టింపు సిక్ లీవ్లు తీసుకుంటున్నారని.. ఇది సంస్థల ఖర్చులు, ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతోందని సర్వేలో వెల్లడైంది.
వెల్లడైన అంశాలు ఇవీ..
⇒ ఆఫీసుల్లో సామాజిక కార్యక్రమాలు ఉద్యోగుల సంతోషాన్ని 50% పెంచుతున్నాయి.
⇒ భోజన వేళల్లో సహోద్యోగులతో సంభాషణలు సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.
⇒ సహోద్యోగులతో క్రమం తప్పకుండా సంభాషించే 44% మంది ఉద్యోగులు తమకు ఆఫీసులో కనీసం ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని నమ్ముతున్నారు.
⇒ సామాజికంగా కనెక్ట్ అయిన 38% మంది ఉద్యోగుల మధ్య బంధం ధృడంగా ఉంది.
⇒ ఆఫీసుల్లో సామాజిక సంబంధాలు లేని వారు 10 శాతమే.
⇒ క్యాంటీన్లలో 58%, భోజన విరామ సమయాల్లో 67% సామాజికీకరణ జరుగుతోంది.
⇒ సామాజిక కలయికల సందర్భంగా 71% మంది ఉద్యోగులు తమ సంస్థ గురించి సానుకూల ప్రచారం చేస్తున్నారు. ఇది బలమైన ఎంప్లాయర్ నెట్ ప్రమోటర్ స్కోర్ ను సృష్టిస్తుంది.
⇒ కార్యాలయంలో స్నేహితులుగా ఉన్న 41% మంది ఉద్యోగులు బలమైన భావనను ఆస్వాదిస్తున్నారు.
⇒ సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య సహకార రేటు 12 శాతమే.
సమస్యల పరిష్కారంలో యాజమాన్యాలకు ఇదో కొత్త దృక్పథం..
ఉద్యోగులు, ఉత్పాదకత వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సర్వే ఫలితాలు సంస్థల యాజమాన్యాలకు కొత్త దృక్పథాన్ని అందిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా మెలిగే 42% మంది ఉద్యోగులు తమ సంస్థ వ్యూహం, లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో కేవలం 19% మంది ఉద్యోగులే తమ సంస్థలతో కనెక్ట్ అయినట్లు భావిస్తున్నారు. ఇది సంస్థలకు తీవ్రమైన వ్యాపార ప్రమాదంగా మారుతోంది.
– వికాస్ చావ్లా, కంపాస్ గ్రూప్ ఇండియా ఎండీ