వ్యవసాయ బావిలో 24 గంటలు | Woman Survives 24 Hours In Farm Well After Being Pushed In Karimnagar, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో 24 గంటలు

Jul 3 2026 9:29 AM | Updated on Jul 3 2026 10:14 AM

woman survives 24 hours in farm well after being pushed in karimnagar

కరీంనగర్ జిల్లా: నీటిలో గంటసేపు ఉంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వ్యవసాయబావిలో 24 గంటలపాటు నరకం అనుభవించిందో మహిళ. బావి యజమాని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన లక్ష్మి అడ్డా కూలీ. నిత్యం నగరంలోని టవర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న లేబర్‌ అడ్డా వద్దకు పని కోసం వస్తుంది. బుధవారం ఉదయం కూడా అడ్డా మీదకు వచ్చింది.

 ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని పిలిచాడు. రాపిడో బైక్‌ బుక్‌ చేసి తిమ్మాపూర్‌ స్టేజీ వరకు పంపించాడు. మరో బైక్‌పై వెనకే వెళ్లాడు. తిమ్మాపూర్‌ నుంచి తన బైక్‌ ఎక్కించుకొని నుస్తులాపూర్‌ శివారులోని ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి, ఒంటిపై ఉన్న బంగారం లాక్కొని, బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో దరికి చేరి తాడు పట్టుకుంది. ఆ తాడును కోసేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరాతో బుధవారం రాత్రంతా, గురువారం మధ్యాహ్నం వరకు లక్ష్మి బావిలోనే ఉండిపోయింది. 

మిస్సింగ్‌ కేసు నమోదుతో.. 
బుధవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో లక్ష్మి కొడుకు కరీంనగర్‌లోని త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం లేబర్‌ అడ్డా వద్ద తన తల్లిని డ్రాప్‌ చేశానని, ఆ తర్వాత ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా లక్ష్మి నుస్తులాపూర్‌ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావివద్దకు వెళ్లిన పొలం యజమానికి బావిలోంచి అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బావి వద్దకు చేరుకొని మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రాపిడో బుక్‌ చేసిన వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement