ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ | Wedding card goes viral on social media | Sakshi
Sakshi News home page

ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ

Mar 8 2023 2:37 AM | Updated on Mar 8 2023 5:57 PM

Wedding card goes viral on social media - Sakshi

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు.

ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ.

ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Advertisement
 
Advertisement
Advertisement