నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్‌ | Wanaparthy Collector Fires On Negligence Officers In Prajavani | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం చేస్తే ఎండలో నిలబెడతా: వనపర్తి కలెక్టర్‌

May 10 2022 8:44 AM | Updated on May 10 2022 10:31 AM

Wanaparthy Collector Fires On Negligence Officers In Prajavani - Sakshi

సాక్షి,వనపర్తి: ‘ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.. నిర్లక్ష్యం చేసిన అధికారులను ఎండలో నిలబెట్టేందుకు వెనుకాడబోం..’ అంటూ కలెక్టర్‌ షేక్‌యాస్మిబాషా మండిపడ్డారు. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ‘ప్రజావాణి’లో అడిషనల్‌ కలెక్టర్‌ ఆశిష్‌సంగ్వాన్‌తో కలిసి ఆమె మొత్తం 20అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకే సమస్యపై అర్జీదారులు రెండోసారి రాకుండా పరిష్కరించాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఉదయం 11 గంటలలోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని, ‘ప్రజావాణి’కి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. 

హెచ్‌హెచ్‌పీపై కలెక్టర్‌ ఆగ్రహం
వేరే వారి విద్యుత్‌ లైన్‌ను తమ పొలంలో వేయటంతో ఇటీవల షార్ట్‌ సర్క్యూట్‌ అయిందని కలెక్టర్‌కు గోపాల్‌పేట మండలం ధర్మాతండాకు చెందిన నార్యానాయక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో ఎనిమిది ఎకరాల్లోని మామిడితోటలో కొన్ని చెట్లు కాలిపోయాయన్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదన్నారు. విద్యుత్‌ అధికారులను ఎప్పుడు అడిగినా.. ‘కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి ఒత్తిడి ఉందంటూ..’ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు చెప్పారు. కలెక్టరేట్‌ నుంచి ఎవరు ఒత్తిడి తెచ్చారని గట్టిగా అడిగితే ధరణి ఆపరేటర్‌ (హ్యాండ్‌ హోల్డింగ్‌ పర్సన్‌) అనడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాను ఎవరికీ ఫోన్‌ చేయలేదని హెచ్‌హెచ్‌పీ చెప్పుకొచ్చారు. ఇక జిల్లా కేంద్రంలో 8సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నాయకులు కోరారు. కొందరు నాయకులు ఉపాధ్యాయ భవన్‌ స్థలంలో షాపులు నిర్మించి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

చదవండి: వంట విషయంలో తల్లి, కూతురు గొడవ.. ఖాళీ బీరు సీసా తీసుకుని..


∙ 

Advertisement
 
Advertisement
Advertisement