పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం | VROs want to consider their seniority | Sakshi
Sakshi News home page

పదోన్నతులకు ‘సర్దుబాటు’ గండం

Sep 1 2023 3:53 AM | Updated on Sep 1 2023 6:28 AM

VROs want to consider their seniority - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) సర్దుబాటు ప్రక్రియ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీఆర్‌వోల వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం గతేడాది ఆగస్టులో రాష్ట్రంలోని 5,138 మంది వీఆర్‌వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం సర్దుబాటు చేసింది. జూనియర్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో వీరిని నియమించింది.

అయితే రెవెన్యూ శాఖలో సుదీర్ఘంగా పనిచేసిన తమ సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని తాము వెళ్లిన కొత్త శాఖల్లో పదోన్నతులు కల్పించాలని, అప్పటివరకు ఆయా శాఖల్లో పదో న్నతులు ఇవ్వద్దని పాత వీఆర్‌వోలు కోర్టులకు వెళ్లడం, వీరి అభ్యర్థన మేరకు కోర్టులు స్టేలు ఇస్తుండడంతో పలు శాఖల్లో శాఖాపరమైన పదోన్నతులకు బ్రేక్‌ పడుతోంది. ఈ తరుణంలో పదోన్నతులకు కోర్టుల రూపంలో రెడ్‌ సిగ్నల్‌ పడుతుండడంతో ఆయా శాఖల ఉద్యోగులు, ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

ఉన్నత విద్య, వైద్య శాఖల్లో ఆటంకాలు 
ఉన్నత విద్యాశాఖలో జూనియర్‌ లెక్చరర్ల పదోన్నతుల్లో అర్హత గల జూనియర్‌ అసిస్టెంట్లకు 10% కోటా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న సిబ్బందితో ఆ శాఖ అధికారులు జేఎల్‌ పదోన్నతుల కోసం సీనియార్టీ జాబితా తయారు చేశారు.

అయితే ఇదే శాఖలో సర్దుబాటు అయిన వీఆర్‌వో ఒకరు తనకు కూడా జేఎల్‌ ఉద్యోగం చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని, రెవెన్యూ శాఖలో పనిచేసిన తన సీనియా ర్టీ ని పరిగణనలోకి తీసుకుని సీనియార్టీ జాబితాలో తన పేరు కూడా చేర్చేలా ఆదేశాలివ్వాలని, అప్పటివరకు ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థన మేరకు జేఎల్‌ పదోన్నతులపై స్టే విధిస్తూ ఆగస్టు నెలలో ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల విషయంలోనూ ఇదే జరిగింది. సీనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతుల జాబితాలో తమ పేర్లు కూడా చేర్చాలంటూ పలువురు సర్దుబాటు వీఆర్‌వోలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement