సర్పై ఈసీ నోటీసులకు ఈసీఐనెట్ పోర్టల్ ద్వారా ఓటర్లు సమాధానం ఇచ్చే వెసులుబాటు ఎన్నికల సంఘం
నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒకటి రుజువుగా అప్లోడ్ చేయొచ్చు
కానీ నోటీసులు ఎవరికి వస్తాయో తెలియక ఓటర్లలో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ‘ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా మనకూ నోటీసులు పంపుతారా?’ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది ఓటర్లకు ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లుండగా వారిలో 92,87,577 ఓటర్ల అర్హతలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. వారిలో 32,36,659 మంది అన్మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయనుంది. వ్యత్యాసాలు ఉన్న 60,50,918 మంది ఓటర్లలో స్వల్ప వ్యత్యాసాలు కలిగిన వారిని ఉపేక్షించి మిగిలిన వారికి నోటీసులు పంపాలని స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల (ఈఆర్వో)ను ఆదేశించింది. అక్టోబర్ 15లోగా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియకు గడువు ఉండటంతో ఓటర్లందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేయాలని ఈఆర్వోలు నిర్ణయించారు.
అయితే అన్మ్యాప్డ్ ఓటర్లు, వ్యత్యాసాలున్న ఓటర్ల జాబితాలను ఈసీ ప్రకటించకపోవడంతో ఈ విషయంలో ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ఎవరి పేరిట అయినా ఈఆర్వోలు నోటీసులు సిద్ధం (జనరేట్) చేసి ఉంటే క్షణాల్లో తెలుసుకొనే వెసులుబాటు ఉంది. ఇందుకోసం ఈసీఐ వోటర్స్ వెబ్సైట్ https:// voters.eci.gov.in/ home/ hearingNoticeను తెరిచి అందులో సబ్మిట్ డాక్యుమెంట్ అగైన్స్ట్ నోటీస్ ఇష్యూడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత మొబైల్ నంబర్/ఎపిక్ కార్డు నంబర్ను ఎంటర్ చేస్తే ఫోన్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మన పేరిట ఇప్పటివరకు నోటీసు జనరేట్ అయిందో లేదో తెలిసిపోనుంది. ఒకవేళ నోటీసు జనరేట్ కాకుంటే ‘ఈరోజు నాటికి నోటీసు జనరేట్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చెక్ చేసుకోండి’అనే సందేశం స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ నోటీసు జనరేట్ అయినట్లు తెలిస్తే ఈసీ నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని రుజువుగా వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. దీనివల్ల ఓటర్లు బీఎల్ఓలు, ఈఆర్వోల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్తోపాటు తమ ప్రాంత బీఎల్ఓ/ఈఆర్వో/ఏఈఆర్వోకు సైతం నోటీసులకు రాతపూర్వక సమాధానాన్ని ఓటర్లు ఇవ్వొచ్చు.


