15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్ జిల్లాలోనే అధికం | Vehicle scrapping policy 2024, over 21 lakh old vehicles in Telangana | Sakshi
Sakshi News home page

15 ఏళ్లు దాటిన వాహనాల్లో బైక్‌లదే అగ్రస్థానం.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే అధికం

Oct 10 2024 5:25 PM | Updated on Oct 10 2024 5:59 PM

Vehicle scrapping policy 2024, over 21 lakh old vehicles in Telangana

vehicle scrapping policy 2024: పదిహేను ఏళ్లు దాటిన వాహనాల విషయంలో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన‌ ‘వాలంటరీ వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ‌ రవాణాశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు గడువు తీరిన వాహనాలు దాదాపు 21 లక్షలకుపైగా ఉన్నాయి. వీటిలో సింహభాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. స్క్రాపింగ్‌ తప్పనిసరి కాదనడంతో కొందరు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ (ఆరీ్వఎస్‌ఎఫ్‌) పేరిట స్క్రాపింగ్‌కు రాష్ట్రవ్యాప్తంగా సదుపాయాలు కల్పించనున్నారు.  

ద్విచక్రవాహనాలే అధికం  
మొత్తంగా 21.27 లక్షల వాహనాల కాలం తీరిపోయింది. అయితే వీటిని ఇప్పటికిప్పుడు స్క్రాప్‌నకు పంపాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. వీటిలో ఫిట్‌నెస్‌ బాగుంటే మునుపటిలా నడుపుకోవచ్చు రూ.5 వేలు చెల్లించి ఐదేళ్లు, ఆ తర్వాత కూడా ఫిట్‌గా ఉంటే.. రూ.10 వేలు చెల్లించి మరో ఐదేళ్లు నడుపుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 21,27,912 వాహనాలు 15 ఏళ్లు వయసు పైబడ్డాయి. ఇందులో 9 లక్షల వాహనాలు హైదరాబాద్‌లో ఉండగా.. రంగారెడ్డిలో 2.3 లక్షల వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల్లో అధికశాతం ద్విచక్ర వాహనాలే కావడం గమనార్హం.

మళ్లీ అందులోనూ 1.3 లక్షల బైకులు హైదరాబాద్‌కు చెందినవి కాగా, 1.8 లక్షల ద్విచక్రవాహనాలు రంగారెడ్డిలో ఉన్నాయి. ఈ రెండు జిల్లాల తర్వాత 15 ఏళ్లు పైబడిన వాహనాలు వరుసగా మేడ్చల్‌ (1.5 లక్షలు), కరీంనగర్‌ (1.5 లక్షలు) నిజామాబాద్‌ (1.2 లక్షలు) జిల్లాల్లో ఉన్నాయి. ఈ లెక్కన గ్రీన్‌ ట్యాక్స్‌ అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలోనే వసూలు కానుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement