మహిళలకు శుభవార్త.. రూ.80కే టీ-24 టికెట్‌! సిటిబస్సులో 24 గంటల పాటు..

TSRTC Provide T 24 Ticket For Womens Rs 80 Reduce Financial Burden - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్‌ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది.

ఈ కొత్త టి-24 టికెట్‌ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అనూహ్య స్పందన ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అందుబాటులోకి  తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలిపారు. ''సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది.

కొత్తగా సీనియర్‌ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్‌ అందించాలని సంస్థ నిర్ణయించింది." అని వారు పేర్కొన్నారు.   మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు.

అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్‌, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.

(చదవండి: TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్‌ నుంచి తొలగిస్తాం!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top