
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్28) మధ్యాహ్నం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. 783 పోస్టులకు 782మంది ఎంపికయ్యారు. ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదు.
గ్రూప్-2 అబ్బాయిలలో 1.హర్ష వర్ధన్, 2.సచిన్, 3.మనోహర్ రామ్, 4.శ్రీరామ మధు, 5.ప్రితం రెడ్డి టాపర్స్లో నిలవగా.. అమ్మాయిలలో 1.వినిషా రెడ్డి, 2.సుస్మిత, 3.శ్రీవేణి, 4.శ్రీలత, 5.స్నేహ నిలిచారు.
గ్రూప్–2 సర్విసులకు సంబంధించి 18 కేటగిరీల్లో 783 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 జనవరి 18నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు... దాదాపు నెలరోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించింది. 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలు దాదాపు మూడుసార్లు వాయిదా పడ్డాయి. చివరకు గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 1,368 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షా ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి.