
ప్రతిపాదనలు పంపాలని జిల్లా రిజిస్ట్రార్లకు ప్రభుత్వ ఆదేశం
ట్రిపుల్ ఆర్ సమీపంలో 200 శాతం, సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో 300 శాతం పెంచాలంటూ ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరలను పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), రీజినల్ రింగ్రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య ప్రాంతంపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఏ ప్రాంతంలో ఎంత మొత్తం ధరలు పెంచేందుకు వీలుంటుందనే అంశంపై ప్రతిపాదనలు పంపాలని అన్ని జిల్లాల రిజిస్ట్రార్లను ఇప్పటికే ఆదేశించగా, అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విలువకు, మార్కెట్ విలువకు ప్రస్తుతం భారీ వ్యత్యాసం ఉంది. దీన్ని తగ్గించడంతో పాటు, రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రాంతంలో భూముల ధరలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ప్రతిపాదనల్లో కొన్ని..
ట్రిపుల్ ఆర్ ప్రాంతంలోని సదాశివపేట మండలం పెద్దాపూర్లో రిజిస్ట్రేషన్ రేటు చదరపు గజానికి రూ.1,700 (కమర్షియల్), రూ.1,100 (రెసిడెన్షియల్) ఉంది. దీనిని కమర్షియల్ ఏరియాలో చ.గజానికి రూ.3,500ల వరకు, రెసిడెన్షియల్ ఏరియాలో రూ.2,400 వరకు పెంచాలని ప్రతిపాదనలు పంపారు. అంటే ఈ ప్రాంతంలో సుమారు 200 శాతం వరకు భూముల ధరలు పెంచాలని భావిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు, ఈదులనాగులపల్లి, వెలిమెల, పాఠిఘనాపురం, కర్దనూరు, ముత్తంగి, పోచారం, పటేల్గూడ, కిష్టారెడ్డిపేట, సుల్తాన్పూర్, దయార, బొల్లారం వంటి గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ధరను 300 శాతం వరకు పెంచాలని ప్రతిపాదించారు.
రామచంద్రాపురంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ రేటు చదరపు గజానికి రూ.22,500 ఉంది. దీన్ని రూ.50 వేల వరకు ప్రతిపాదిస్తున్నారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అపార్ట్మెంట్లలో ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.2,250 వరకు రిజిస్ట్రేషన్ రేటు ఉంది. దీనిని రూ.3,500ల వరకు పెంచాలని భావిస్తున్నారు.