సాక్షి, నిజామాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. కానీ హద్దులు ఉల్లంఘిస్తే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించం’’ అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన కొండా సురేఖ ఎపిసోడ్పై స్పందిస్తూ.. ప్రతి పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీలో మరింత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందన్నారు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడితే సహించబోమన్నారు.
నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికలపై మాట్లాడాలని.. అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడటం సమంజసం కాదని మహేష్ గౌడ్ హితవు పలికారు. కాగా, నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తపనతో ముందుకు వెళ్తున్నామన్న మహేష్ గౌడ్.. జిల్లా అభివృద్ధి గతంలో కాంగ్రెస్ హయంలో జరిగిందన్నారు.
వైఎస్సార్ హయంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. కొత్తగా అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. రాష్ట్రంలో అత్యధికం ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో ఇచ్చాం. హైదరాబాద్ మాదిరి నిజామాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ టవర్స్ చేపట్టినట్లు మహేష్ గౌడ్ అన్నారు.


