సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులను మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి.
మరోవైపు.. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్యనగర్లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
50 గజాల్లో 7+1 నిర్మాణం
ఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవనం నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తులతో పాటు పెంట్హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్బ్యాక్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది.


