
బంజారాహిల్స్: ఓ మైనర్ హెల్మెట్ లేకుండా వస్తున్నాడని హోండా యాక్టివాను ఆపి చలానా విధించిన ట్రాఫిక్ పోలీసులకు..అది చోరీ బైకు అని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు చౌరస్తాలో బంజారాహిల్స్ ట్రాఫిక్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ముగ్గురు యువకులు హోండా యాక్టివాపై నెంబర్ ప్లేట్ లేకుండా వస్తూ కనిపించారు. హెల్మెట్ కూడా ధరించకపోవడంతో వారిని ఆపారు. బైక్ నడిపిస్తున్న వ్యక్తి మైనర్ అని తేలింది. బైక్ ధ్రువ పత్రాలు అడగ్గా చూపించలేదు.
బైక్ నెంబర్ కూడా చెప్పకపోవడంతో చాసిస్ నెంబర్ ఆధారంగా టీఎస్09 ఈ జెడ్ 1525 అనే రిజి్రస్టేషన్ నెంబర్ కలిగిన బైక్ అని గుర్తించారు. దీంతో ఈ నెంబర్ మీద మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చలానా విధించారు. బైక్ నెంబర్తో పాటు ఫోటోను ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేశారు. ఆన్లైన్లో బండి నెంబర్ నమోదైన వెంటనే యజమానికి మెసేజ్ వెళ్ళింది. నిమిషాల వ్యవధిలోనే వాహన యజమాని లియాండర్ టెర్రస్ స్మిత్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు ఉరుకులు పరుగులతో వచ్చాడు. కాసేపటి క్రితం ట్రాఫిక్ పోలీసులు చలానా విధించిన బండి తనదేనని, ఏప్రిల్ 2వ తేదీన తన బైక్ చోరీకి గురికాగా అదే రోజు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు ఈ విషయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తదితరులకు తెలిపారు. అప్పటికీ యాక్టివా మీద వచి్చన ముగ్గురు అక్కడే ఉండడంతో వారిని పట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యవహారాన్ని మీర్పేట పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పీఎస్ పరిధిలో యాక్టివా బైక్ చోరీ అయిన మాట వాస్తవమేనని ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో బైక్ మీద వచ్చిన ముగ్గురితో పాటు బైక్ను కూడా మీర్పేట పోలీసులకు అప్పగించారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు విధించిన చలానా చోరీ బైక్ను పట్టించడంతో మీర్పేట్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.