సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విద్యాశాఖ ద్వారా అన్ని పాఠశాలల సమాచారం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులకు అందించనున్నారు. మీసేవ సహకారంతో వాట్సాప్ ద్వారా ఇకపై స్కూల్ అప్డేట్స్ నేరుగా వారి ఫోన్ కు చేరనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల విద్యకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను నేరుగా వాట్సాప్ ద్వారా పొందనున్నారు. విద్యా పురోగతి, పరీక్షల సమాచారం, విద్యా సామగ్రి పంపిణీ, స్కాలర్షిప్లు, పాఠశాల కార్యక్రమాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాలపై సకాలంలో సమాచారం అందుబాటులోకి రానుంది.
ఈ ప్లాట్ఫారమ్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యా శాఖతో కలిసి అభివృద్ధి చేసింది.
విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, హాల్ టికెట్ల డౌన్లోడ్, మార్కుల మెమోలు, పరీక్షా ఫలితాలు, ఎస్ఎస్సీ మెమోలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లు, ఎస్ఎస్సీ మెమో సవరణల దరఖాస్తులు.. సేవలు పొందవచ్చు
త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు
యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ వివరాలు, విద్యార్థుల హాజరు సమాచారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం, రెసిడెన్షియల్ పాఠశాలల సంక్షేమ కార్యక్రమాల వివరాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ


