మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ | Telangana Govt issues GO For Double Bedroom House For Moosi Expatriates | Sakshi
Sakshi News home page

మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఉత్తర్వులు జారీ

Sep 24 2024 8:47 PM | Updated on Sep 24 2024 8:51 PM

Telangana Govt issues GO For Double Bedroom House For  Moosi Expatriates

సాక్షి, హైదరాబాద్‌: మూసీ నది అభివృద్ధి  ప్రాజెక్టులో నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్  అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే  కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తూ ఈ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా మూసీ నదిని ప్రక్షాళన చేసి.. దానిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరిసరాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్‌ బెడ్‌ రూం గృహాలను ఇవ్వనుంది ప్రభుత్వం.
చదవండి: ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశం

మూసీలో మొత్తం 10,200 మందిని నిర్వాసితులుగా ప్రభుత్వం గుర్తించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు రేపు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు.

మరోవైపు రివర్ బెడ్‌లో  ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి.. అక్కడ ఉన్న వారిని తరలించనుంది ప్రభుత్వం. మూసీ బఫర్ జోన్‌లో  నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లించనుంది. నిర్మాణ ఖర్చుతో పాటు, పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించనుంది.  వీటితోపాటు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా కేటాయించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement