సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసింది. అందులో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుమతి తెలిపింది. అంతేకాదు.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రిజర్వేషన్ల నివేదికను కూడా ఖరారు చేసి పంపినట్లు పేర్కొంది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ప్రకారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థలలో మహిళలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు తగిన రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, ఇకపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం మాత్రమే మిగిలిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు మూడు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.


