దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది | Telangana: Dr Maganti Gopinath Speech At Medhomadanam Conference | Sakshi
Sakshi News home page

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది

Nov 20 2022 2:49 AM | Updated on Nov 20 2022 7:26 AM

Telangana: Dr Maganti Gopinath Speech At Medhomadanam Conference - Sakshi

సదస్సులో మాట్లాడుతున్న  డాక్టర్‌ మాగంటి గోపీనాథ్‌  

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: త్రివర్ణ పతాకాన్ని గౌరవించని వారు ఈ దేశాన్ని పాలిస్తున్నారని భారత్‌ బచావో కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ మాగంటి గోపీనాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత్‌ బచావో ఆధ్వర్యంలో జరిగిన మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశం నేడు అన్ని రంగాల్లోనూ సమస్యలను ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయాలను భష్ట్రు పట్టిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు వింటేనే వణికిపోతోందని వ్యాఖ్యానించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సంపదను కొన్ని కులాలకే దోచిపెడుతున్నారని, రూ.10లక్షల కోట్లకు సంబంధించిన బకాయిలు ఒకటి, రెండు కులాలకు చెందిన వారివి మాత్రమే ఎగవేశారని, ఈ మొ త్తాన్ని దేశంలో 10 లక్షల స్కూళ్లపై పెట్టుబడి పెడితే మంచి విద్య అందేదని అన్నారు.

తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌కు సిద్ధాంతపరమైన భావజాలం ఉందనుకోవటం పొరపాటేనని,. దేశ మౌలిక విలువలు, సూత్రాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్వంసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ నేడు జై శ్రీరాం అంటే వెన్నులో వణుకు పుడుతుందే తప్ప భక్తిభావం రావటం లేదన్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మంత్రి కవాసి లక్మ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు ఈ దేశ సంపదను కట్టబెడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో బహుజన ముక్తి మోర్చ జాతీయ అధ్యక్షుడు వామన్‌ మెశ్రమ్, ప్రొఫెసర్‌ పిఎల్‌.విశ్వేశ్వర్‌రావు, సామాజికవేత్త మూల్‌చంద్‌ రాణా, ప్రొఫెసర్లు సూరేపల్లి సుజాత, తిరుమలి, మురళీ మనోహర్, బౌద్ధపీఠ అధిపతి భగవతి మహారాజ స్వామి, భారత్‌ బచావో ప్రతినిధి గాదె ఇన్నయ్య తదితరులు ప్రసంగించారు. 

Advertisement
 
Advertisement
Advertisement