Telangana: కేబినెట్‌ సమావేశంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ

Telangana Cabinet Meeting On Tuesday Take Key Decisions - Sakshi

నేడు పీఆర్సీ అమలు ప్రకటన

పెరిగిన జీతాలు జూలై నుంచి!

నేటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం

లాక్‌డౌన్‌ ఎత్తివేత, రాత్రి కర్ఫ్యూలపైనా నిర్ణయాలు

కల్తీ నియంత్రణకు ఆర్డినెన్స్‌ తెచ్చే అవకాశం

ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల రద్దు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపైనా కొలిక్కి.. 

మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. పీఆర్సీ అమలు ద్వారా ప్రస్తుత జూన్‌ నెలకు సంబంధించి వచ్చే జూలైలో చెల్లించనున్న జీతాలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 
►పీఆర్సీ బకాయిల చెల్లింపులపైనా కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
►లాక్‌డౌన్‌ ఎత్తివేయని పక్షంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు సమయాన్ని పొడిగించే అవకాశం.
►మరికొన్ని రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం.
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల రద్దు ద్వారా విద్యార్థులందరినీ పాస్‌ చేసే అవకాశం. 
►ఒకవేళ ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎవరైనా ఫెయిలై ఉంటే, ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులను ప్రథమ, ద్వితీయ సంవత్సరం సబ్జెక్టుల్లో కలిపి పాస్‌ చేసే చాన్స్‌.

సాక్షి, హైదరాబాద్‌: నేడు జరగనున్న కేబినెట్‌ సమావేశంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజానీకం సైతం ఇందులో తీసుకునే కీలక నిర్ణయాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్‌ శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్‌ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పీఆర్సీ అమలు అంశంపై చర్చించి ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రిమండలికి నివేదించనున్నారు. ఆర్థిక పరిస్థితులపై సమీక్షించిన అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీపై మంగళవారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని, ఆ వెంటనే ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో సోమవారం తీవ్ర చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం వారు మరోసారి కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 

లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.. సడలింపు పొడిగిస్తారా?
కరోనా రెండో వేవ్‌ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో మినహాయింపు సమయాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతు బంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

ఇంటర్‌ పరీక్షల రద్దుపై.. 
కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్‌లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్‌ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్‌ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top