సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో మరో భారీ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్ల మీదుగా సాగే ఆరు లేన్ల భారీ గ్రేడ్ సెపరేటర్ (ఫ్లై ఓవర్) పనులకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తుది అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ పనుల్ని రూ.189.68 కోట్లతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది.
టెండర్ ఖరారు కావడంతో పనులు ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హెచ్– సిటీ పథకం కింద కేటాయించిన నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే మైలార్దేవ్పల్లి, శంషాబాద్ రోడ్డు, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తొలగిపోవడంతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు కూడా సమయం ఆదా కానుంది.
స్టీల్ బ్రిడ్జి ఎంతవరకు వచ్చింది?
మలక్పేట: మూసారంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (RV Karnan) తనిఖీ చేశారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులు వేగిరం చేసి, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆదేశించారు.

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి మొత్తం 85 స్పాన్లు ఉండగా వాటికి గర్డర్లు నిర్మించామని, 79 స్పాన్లకు డెక్స్లాబ్ పూర్తయిందని, అప్ ర్యాంప్, డౌన్ర్యాంప్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మూసారాంబాగ్ డౌన్స్ట్రీమ్ బ్రిడ్జి ఏ2–పీ4 స్పాన్ బాటమ్ స్లాబ్ పూరైందని, పీ3–పీ4 స్టేజింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
ఎంఎంసీలో రూ.1,474 కోట్ల పనులకు 7న సీఎం శంకుస్థాపన
ఈ నెల 7న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లో రూ.1,474 కోట్ల పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు చేయనున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్కృష్ణారెడ్డి తెలిపారు.
ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్లు(అంచనా రూ.960 కోట్లు), టీకేఆర్ కాలేజ్, గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా నిర్మించనున్న ఫ్లై ఓవర్ (అంచనా రూ.416 కోట్లు), ఉప్పల్ భగాయత్ లేఔట్ ఫేజ్–3లో ఎంఎంసీ శాశ్వత భవన నిర్మాణం (అంచనా రూ.98 కోట్లు) పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఇందులో రహదారులు, ఫ్లై ఓవర్ల పనులకు అవసరమైన భూసేకరణకు రూ.559.46 కోట్లు ఖర్చు చేయనున్నారు.
చదవండి: చెత్తకు నిప్పు.. ఎంత పనిచేసింది..


