హైదరాబాద్: ఖాళీ స్థలంలో చెత్త కుప్పకు నిప్పు పెట్టగా, పక్కనే పార్కింగ్ చేసిన మూడు కార్లు దగ్ధమయ్యాయి. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. బోడుప్పల్ సర్కిల్ శ్రీనివాస్నగర్ కాలనీలో ఖాళీ స్థలంలో స్థానికులు కార్లు పార్క్ చేశారు. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్న చెత్తకు నిప్పు అంటించారు. గాలికి ఆ మంటలు ఎగిసిపడి పక్కనే ఉన్న మూడు కార్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేశారు. ఒక కారు పూర్తిగా దగ్ధం కాగా మరో రెండు సగం వరకు కాలిపోయాయి.


