నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్‌ | Team of six officers who conducted questioning BRS Leader KCR | Sakshi
Sakshi News home page

నాలుగున్నర గంటలు.. కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్‌

Feb 2 2026 6:08 AM | Updated on Feb 2 2026 7:44 AM

Team of six officers who conducted questioning BRS Leader KCR

విచారణ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న కేసీఆర్‌. చిత్రంలో కేటీఆర్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ ప్రారంభం 

ప్రశ్నించిన ఆరుగురు అధికారుల బృందం

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆదివారం ప్రశ్నించింది. నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి నాలుగున్నర గంటలపాటు వివిధ అంశాలపై విచారించింది. దీనికోసం కేసీఆర్‌ నివాసంలోకి మొత్తం 15 మందితో కూడిన సిట్‌ బృందం వెళ్లింది. అక్కడి రెండో అంతస్తులోని ఓ గదిలో నగర సంయుక్త సీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ నేతృత్వంలో కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరి, ఐపీఎస్‌ అధికారి నారాయణరెడ్డి, నాన్‌ కేడర్‌ ఎస్పీ ఎం.రవీందర్‌రెడ్డి, అదనపు ఎస్పీ కేఎస్‌ రావు, ఏసీపీ సీహెచ్‌ శ్రీధర్‌లు కేసీఆర్‌ను ప్రశ్నించారు. 

సిట్‌ అధికారులు తమ వెంట ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలతో కూడిన ఫైళ్లు, ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు, వీటితోపాటు కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితులు, సాక్షుల వాంగ్మూలాల పత్రాలను రెండు ట్రంక్‌ పెట్టెల్లో తీసుకెళ్లారు. విచారణ ముగించుకొని రాత్రి తిరిగి వెళుతున్న సమయంలో సిట్‌ బృందం వీటిని తమ వెంట తీసుకెళ్లింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీకి వెళ్లిన అధికారులు సిట్‌ చీఫ్‌గా ఉన్న నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. కేసీఆర్‌ విచారణ తీరుతెన్నుల్ని ఆయనకు వివరించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. కేసీఆర్‌ విచారణ నేపథ్యంలోపోలీసులు నందినగర్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అనేక అంశాలపై ప్రశ్నలు  
గత వారంలో సిట్‌ అధికారులు కేసీఆర్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. మొదటి నోటీసు తర్వాత కేసీఆర్‌ సమయం కోరుతూ ఎర్రవల్లికి రావాలంటూ లేఖ రాశారు. ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ సిట్‌ మరో నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లో విచారణకు సిద్ధమంటూ ఆయన శనివారం ప్రకటించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని సిట్‌ అధికారులు అప్పటికప్పుడు ప్రశ్నావళిని సిద్ధం చేయడానికి ఉపక్రమించారు. దీంతో రాత్రంతా కూర్చున్న సిట్‌ బృందం కేసీఆర్‌ను అడగాల్సిన ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు నియామకాలు, వీరి ఉద్యోగ విరమణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వడం తదితరాలపై ప్రశ్నించింది. 
 


అప్పట్లో రాధాకిషన్‌రావు, భుజంగరావు పలుమార్లు ప్రగతి భవన్‌కు వెళ్లిరావడం, ట్యాపింగ్‌కు ఎంపిక చేసుకున్న ఫోన్‌ నంబర్లు, కొందరు బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లూ ట్యాప్‌ కావడం, వ్యాపారుల ఫోన్లపై నిఘా, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్లు రావడం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగింది. సిట్‌ సిద్ధం చేసుకున్న ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలతో కలిపి నాలుగున్నర గంటల విచారణ సాగింది. అయితే కేసీఆర్‌ విచారణ నేపథ్యంలో సిట్‌ అధికారులు ఆ గదిలోకి ఎవరినీ అనుమతించలేదు. న్యాయవాదులకూ అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు కేసీఆర్‌ ఒక్కరినే ఉంచి ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేసిన అధికారులు కేసీఆర్‌ వాంగ్మూలాన్నీ నమోదు చేసుకొని వెళ్లారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నందినగర్‌లోని నివాసం నుంచి ఎర్రవల్లికి కేసీఆర్‌ బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్‌ వెంట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement