వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్‌తోనే | Sakshi
Sakshi News home page

వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్‌తోనే

Published Mon, Jan 10 2022 4:28 AM

Sugunamma From Nalgonda Surviving Only Drinking Tea For 30 Years - Sakshi

చండూరు: ఉదయం టిఫిన్‌.. మధ్యాహ్నం.. రాత్రి భోజనం.. మూడు పూటలా తింటున్నా.. మధ్యలో స్నాక్స్‌ అని.. ఏవేవో లాగించే రోజులివి. కానీ ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా భోజనం చేయకుండా కేవలం చాయ్‌ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ (60)కు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందారు.

సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స జరిగిన కొన్నిరోజుల తర్వాత అన్నం తింటే జీర్ణం కాక వాంతులయ్యాయి. దాంతో ఇక అన్నంపై విరక్తి పెంచుకున్న ఆమె.. కేవలం చాయ్‌ తాగడం మొదలు పెట్టింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికీ సుగుణమ్మ రోజూ ఒకేసారి చాయ్‌ చేసుకోవడం.. ప్లాస్క్‌లో నింపుతుంది. ఆకలేసినప్పుడల్లా చాయ్‌ తాగుతూ క్షుద్బాధ తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు చాయ్‌లో మరమరాలు వేసుకుంటుంది. సుగుణమ్మ కూతురికి పెళ్లికాగా, కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు.  

Advertisement
Advertisement