డేంజర్‌లో మంజీర! | State Dam Safety Organization report on Manjira Barrage | Sakshi
Sakshi News home page

డేంజర్‌లో మంజీర!

Jun 27 2025 4:47 AM | Updated on Jun 27 2025 4:47 AM

State Dam Safety Organization report on Manjira Barrage

మేడిగడ్డ తరహాలో కొట్టుకుపోయిన బరాజ్‌ అప్రాన్‌

తేల్చిన స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ నివేదిక

మరమ్మతులు లేక దెబ్బతిన్న గేట్లు, మట్టి కట్టలు

డ్యామ్‌ పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోందన్న నిపుణులు

సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ అధ్యయనానికి సిఫారసు

సాక్షి, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు రోజూ 100 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేసే మంజీర బరాజ్‌ తీవ్ర ప్రమాదంలో ఉంది. మేడిగడ్డ బరాజ్‌ తరహాలో..మంజీర బరాజ్‌ నుంచి విడుదలైన వరద ఉధృతికి డ్యామ్‌ దిగువన రక్షణగా ఏర్పాటు చేసిన అప్రాన్‌ కొట్టుకుపోయింది. అప్రాన్‌కి సంబంధించిన కాంక్రీట్‌ కొట్టుకుపోవడంతో బరాజ్‌ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయి. మిగిలి ఉన్న అప్రాన్‌ భాగం సైతం ఎప్పుడైనా కొట్టుకుపోవచ్చు అన్నట్టు బలహీనంగా ఉంది.

అడ్డగోలుగా తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో బరాజ్‌ మట్టి కట్టలు బలహీనమయ్యాయి. ఏళ్ల తరబడిగా మరమ్మతులు లేకపోవడంతో గేట్లతో పాటు స్పిల్‌వేలోని కొంత భాగం కూడా దెబ్బతింది. బరాజ్‌కు తక్షణమే మరమ్మతులు నిర్వహించకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (ఎస్డీఎస్‌ఓ) తేల్చి చెప్పింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌–2021 ప్రకారం ఏర్పాటైన ఎస్డీఎస్‌ఓ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం గత మార్చి 22న బరాజ్‌ను పరిశీలించి ఈ మేరకు ఓ నివేదికను సమర్పించింది. 

కాళేశ్వరం బరాజ్‌ల తరహాలో..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు దిగువన రక్షణగా ఉన్న అప్రాన్‌ వరద ధాటికి కొట్టుకుపోగా, ఆ తర్వాత కాలంలో మేడిగడ్డ బరాజ్‌ కుంగిపోయింది. మిగిలిన రెండు బరాజ్‌లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అదే తరహాలో మంజీర బరాజ్‌ అప్రాన్‌ సైతం కొట్టుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘మంజీర బరాజ్‌ నుంచి విడుదలయ్యే వరద ఉధృతి దిగువ భాగంలో నిరంతరం బరాజ్‌కు నష్టం కలిగించనుంది. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. లేనిపక్షంలో కోత క్రమంగా డ్యామ్‌ వరకు విస్తరించి దాని భద్రతకే ముప్పుగా పరిణమించనుంది..’ అని నివేదికలో ఎస్డీఎస్‌ఓ పేర్కొంది. 

మట్టికట్టలపై అడవిలా తుమ్మ చెట్లు
బరాజ్‌ మట్టికట్టలపై పెద్ద మొత్తంలో తుమ్మ చెట్లు పెరిగి వాటి దృఢత్వాన్ని బలహీనపరుస్తున్నాయని ఎస్డీఎస్‌ఓ తేల్చింది. అడవి తరహాలో తుమ్మ చెట్లు పెరిగిపోవడంతో 1.5 కి.మీ మేర కట్టలను పరిశీలించకపోయినట్టు పేర్కొంది. తుమ్మ చెట్లతో డ్యామ్‌ రివర్‌మెంట్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది.  

బరాజ్‌ పియర్లకు పగుళ్లు..
మంజీర బరాజ్‌ పియర్లు దూరం నుంచి దృఢంగానే కనిపిస్తుండగా, సూక్ష్మంగా పరిశీలించి చూస్తే వాటికి పగుళ్లు వచ్చినట్టు ఎస్డీఎస్‌ఓ పరిశీలనలో బయటపడింది. తట్టుకునే సామర్థ్యానికి మించిన వరద ఒత్తిడిని ఎదుర్కోవాల్సిరావడంతోనే ఈ పగుళ్లు వచ్చాయని తేల్చింది. మంజీర రాతి ఆనకట్ట కావడంతో స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించిన ఆనకట్టలకు ఉండే దృఢత్వం ఉండదని అభిప్రాయపడింది. బరాజ్‌ తీవ్రంగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది అని అభిప్రాయపడింది. 

తాగునీటి అవసరాల కోసం మంజీర బరాజ్‌లో ఏడాది పొడవునా నీళ్లను నిల్వ చేసి ఉంచుతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో బరాజ్‌ను పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపించాలని సిఫారసు చేసింది. అత్యవసర కార్యాచరణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ ప్రణాళిక, బరాజ్‌తో ఉండనున్న ముప్పుపై అధ్యయనం, బరాజ్‌ భద్రతపై సమగ్ర అధ్యయనాన్ని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌తో జరిపించాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement