SSC Results, Telangana 10th Results On Next Week Release - Sakshi
Sakshi News home page

Telangana: వారంలో టెన్త్‌ ఫలితాలు!

Published Wed, May 12 2021 10:28 AM

SSC Results May Release On Next Week Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వారం రోజుల్లో విద్యార్థులందరికీ గ్రేడ్లను, గ్రేడ్‌ పాయింట్లను, జీపీఏను కేటాయించి ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కాగా, పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌–1 (ఎఫ్‌ఏ) ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనుంది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. రాష్ట్ర సిలబస్‌ కలిగిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు, ఎయిడెడ్‌ తదితర అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.

2020–21 విద్యా సంవత్సరంలో కరోనా కారణంగా నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్లకు బదులు రెండు ఎఫ్‌ఏలను నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌) నిర్వహించారని పేర్కొన్నారు. 20 శాతం మార్కులతో నిర్వహించిన ఆ ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగానే విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి గ్రేడింగ్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు. 20 శాతం మార్కులను 100 శాతానికి లెక్కించి గ్రేడ్లు ఖరారు చేయాలని స్పష్టం చేశారు.

ఒక విద్యార్థికి ఎఫ్‌ఏ–1 ఒక సబ్జెక్టులో 20 మార్కులకు వచ్చిన మార్కులకు ఐదింతలు చేసి కేటాయిస్తారు. దీని ప్రకారం ఒక సబ్జెక్టులో 20 మార్కులు వస్తే ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో 100 మార్కులు వచ్చినట్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా ప్రతి సబ్జెక్టులో వచ్చిన మార్కుల పరిధి ఆధారంగా ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో వచ్చిన గ్రేడ్‌ను, ఆ గ్రేడ్‌కు ఇచ్చే గ్రేడ్‌ పాయింట్‌ను కేటాయిస్తారు. చివరకు అన్నీ కలిపి జీపీఏ ఇస్తారు. హిందీ సబ్జెక్టులో పాస్‌ మార్కులు తక్కువ కాబట్టి మార్కుల పరిధి మిగతా సబ్జెక్టుల కంటే వేరుగా ఉంటుంది.
చదవండి: Lockdown: సిటీలో ‘పరిధి’ దాటొద్దు!

Advertisement
Advertisement