లైంగిక దాడులు..సైబర్ నేరాలు...ఏ తరహా వేధింపులైనా ఫిర్యాదు చేయొచ్చు
ప్రత్యేక పోర్టల్ రూపొందించిన ఎన్సీపీసీఆర్
అత్యంత రహస్యంగా ఫిర్యాదుదారుని వివరాలు
ఠాణాకు వెళ్లకుండానే నేరుగా ఆన్లైన్లో కంప్లైంట్ చేసే వీలు
బాధితులే కాదు తల్లిదండ్రులు, ఇతరులెవరైనా దృష్టికి తేవొచ్చు
ఫిర్యాదు చేయగానే ప్రత్యేక ఐడీ జనరేట్
సాక్షి, హైదరాబాద్ : నేటి డిజిటల్ యుగంలో రక్షణ అత్యంత కీలకం. పిల్లల విషయంలో అయితే మరీనూ. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన ప్రస్తుతం రోజుల్లో పిల్లలు లైంగిక దాడులు, సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇలాంటి ఆన్లైన్ నేరాల నుంచి పిల్లలను కాపాడేందుకు జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ‘పోక్సో ఈ–బాక్స్’అద్భుత వేదికగా నిలుస్తోంది. భయమో, సంకోచమో కారణాలేమైనా పిల్లలు తమపై జరిగే లైంగిక, సైబర్ దాడులను తల్లిదండ్రులకు, సంరక్షకులకు చెప్పేందుకు వెనుకాడుతుంటారు.
కానీ, ‘పోక్సో ఈ–బాక్స్’ద్వారా ఎలాంటి అనుమానం, సంకోచం లేకుండా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. భయాందోళనల్లో ఉన్న పిల్లలు సులభంగా అర్థం చేసుకునేలా ఇందులో యానిమేషన్లు, చిత్రాలతో కూడిన ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫిర్యాదుదారుని పేరు, వివరాలు, ఫోన్ నంబర్లు అత్యంత రహస్యంగా ఉంటాయి. పోక్సో ఈ–బాక్స్ ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్సీపీసీఆర్ సభ్యులు నేరుగా పర్యవేక్షించి, తదుపరి చర్యలు తీసుకుంటారు.
ఏంటీ పోక్సో ఈ–బాక్స్?
పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల గురించి పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన పోర్టలే పోక్సో ఈ–బాక్స్. పోక్సో చట్టం–2012 కింద నేరాలను నివేదించడానికి 2017లో ఈ ఆన్లైన్ వేదికను అందుబాటులోకి వచ్చింది.
ఎలాంటి నేరాలపై ఫిర్యాదు చేయవచ్చంటే?
పిల్లలను ఆట స్థలం, మైదానం, పాఠ శాల, ట్యూషన్, స్కూల్ బస్, వ్యాన్ ఎక్క డైనా సరే శారీరక వేధింపులకు గురి చేసినా, ఫోన్ లేదా ఇంటర్నెట్ ఏ మాధ్యమం ద్వారా బ్లాక్ మెయిల్ చేసినా, కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు ఎవరైనా లైంగిక వేధింపులు, సైబర్ నేరాలకు పాల్పడినా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆన్లైన్లో నిరంతరం అనుసరించడం లేదా కంట కనిపెట్టడం (సైబర్ స్టాకింగ్), ఫొటోలను తప్పుగా మార్చి ప్రచారం చేయడం (ఇమేజ్ మార్ఫింగ్), పిల్లల అశ్లీల కంటెంట్ ప్రచారం చేయడం..ఇలా ఏ తరహా నేరాలపై అయినా సులభంగా కంప్లయింట్ చేయవచ్చు.
ఎలా ఫిర్యాదు చేయాలంటే?
https://ncpcr.gov.in వెబ్సైట్లోకి వెళ్లి లాడ్జ్ కంప్లయింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ‘పోక్సో ఈ–బాక్స్’విండో నుంచి సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే pocsoebox.ncpcr@gov.in కు మెయిల్ పంపవచ్చు. టోల్ ఫ్రీ నంబరు: 1800115455, లేదా 98682 35077, 1098 నంబర్ల నుంచి ఫిర్యాదు చేయవచ్చు. బాధిత పిల్లలు స్వయంగా గానీ వారి తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు లేదా సంరక్షకులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు సమర్పించిన వెంటనే ఒక ప్రత్యేక ఐడీ జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా కేసు పురోగతిని తెలుసుకోవచ్చు.


